not found

బత్తిని మొగిలయ్య గౌడ్
బత్తిని మొగిలయ్య గౌడ్ ఓరుగల్లుకు చెందిన స్వాతంత్ర్య సమర యోధుడు. రజాకార్లను ఎదిరించి పోరాడాడు.
                                                                              బాల్యం, కుటుంబం
బత్తిని మొగిలయ్య గౌడ్ వరంగల్ తూర్పు కోట నివాసి. తల్లిదండ్రులు బత్తిని చెన్నమ్మ, మల్లయ్యలు,అన్న బత్తిని రామస్వామి గౌడ్.చెన్నమ్మ, మల్లయ్య ధంపతుల ఐదవ సంతానంగా ఈ కాలపు దీరుడిగా ఖిల్లా ఓరుగల్లులో పాఠాలు నేర్చుకున్నాడు. మొగిలయ్య కోట బడిలో 4వ తరగతి వరకు చదివాడు. బత్తిని మొగిలయ్య గౌడ్, బత్తిని రామస్వామి గౌడ్ లిద్దరు ఆర్యసమాజ్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు.

అందరితో అన్న రామస్వామి భూపతి కృష్ణమూర్తి, ఇతర కాంగ్రెస్ వాదులతో కలిసి కాంగ్రెస్, ఆర్యసమాజ్ మీటింగ్ లకు వెళ్లేవాడు, తమ్ముడు అన్ని విషయాలలో అన్న కు తోడుగా ఉంటూ,గౌడ కుల వృత్తి అయిన తాళ్లు ఎక్కతూ వ్వవసాయం చేసేవాడు. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో అందరితో స్నేహంగా ఉండే ఆరడుగుల ఆజానుబాహుడు.ఆనాటి సమాజంలో గౌడ్ ల పరిస్థితి చాల దుర్భరంగా ఉండేది. నిజాం, భూమి మీద పన్నిలు వసూలు చేసినట్లు గానే కల్లు మీద, తాడిచెట్ల మీద పన్నులు వసూలు చేసేవాడు. పన్నులు కట్టని గౌడులకు విధించే శిక్షలు అతి దారుణంగా, క్రూరంగా ఉండేవి.శతాబ్దాలుగా కుల వృత్తిని నమ్ముకున్న గౌడులపై కొనసాగుతున్న హింసపట్ల బత్తిని మొగిలయ్య గౌడ్ కు నిజాం అన్నను,నిజాం పోలీసులన్ననూ,రజాకార్లన్నను తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. గౌడ్ సాబ్ కత్తి పట్టాడంటే తోప్ సింగ్ లందరు తోకముడవాలసిందే.

మడికొండ లో
స్వతంత్ర అభిలాషను సమాజంలో విస్తృత పరిచే దిశగా పన్నెండవ జాతీయాంధ్ర మహాసభలు 1946లో వరంగల్ లోని మడికొండ లో జరిగాయి. రహస్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు జాతీయ జెండా ఎగురవేయాలనేది దాని ఉద్దేశం. ఫోర్ట్ వరంగల్ చైతన్యాన్ని దశదిశలా వ్యాప్తి చేయాలని కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది. నిజాం రాష్ట్రంలో త్రివర్ణ పతాకావిష్కరణ అధికారికంగా నిషేధించ బడింది. జెండా ఎత్తడం అంటే దెబ్బలకు,జైలుశిక్షకు,మరణానికి వెరవకుండా చేసే సాహసోపేత కార్యము.వరంగల్ కోటలో నిగూఢమైన దేశభక్తి కలిగిన యువకులు బత్తిని రామస్వామి గౌడ్, బత్తిని మొగిలయ్య గౌడ్, సంగరబోయిన కనకయ్య, సంగరబోయిన మల్లయ్య, నరిమెట్ల రామస్వామి, వడ్లకొండ ముత్తయ్య, పోశాల కనుకయ్య,ఆరెల్లి బుచ్చయ్య గార్లు.ఈ జెండా వందన కార్యక్రమాలను వీరు కోట ప్రజల సమక్షంలో నిర్వహించే వారు. స్టేట్ కాంగ్రెస్, కార్యకర్తలందరికి రహస్యంగా నైనా జెండా ఎగురవేయాలనే ఆదేశాలిచ్చింది.స్టేట్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం వరంగల్ లోని చైతన్యం కలిగిన యువకులు,కాంగ్రెస్ నాయకులు,ఆర్యసమాజ్ కార్యకర్తలు వరంగల్ కోటలో జెండా ఎగుర వేసే వారు.

తూర్పు కోటలో
11 ఆగస్టు 1946 ఆదివారం రోజు ఉదయం7.30 గంటలకు వరంగల్ తూర్పు కోటలో జెండా ఎగుర వేయడానికి వరంగల్, హన్మకొండ నుండి వచ్చిన కాంగ్రెస్ నాయకులు యం.యస్. రాజలింగం,టి.హయగ్రీవాచారి,భూపతి కృష్ణమూర్తి, మడూరి రాజలింగం మరియు బత్తిని సోదరులు కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హయగ్రీవచారి జెండా ను ఎగురవేయగా,పిల్లలు పెద్దలంతా జై కొడుతుండగా‍ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.

బలిదానం
అప్పుడే సుమారు రెండు వందల మంది రజాకార్లు, వారి అనుయాయులు మారణాయుధాలతో ఖాసీం షరీఫ్ అనే రజాకార్ నాయకుని అధ్వర్యంలో, జెండా ఎత్తిన నాయకులను చంపడానికి నిజాం అనుకూల నినాదాలను చేస్తూ జెండా ఎత్తిన ప్రాంతానికి చేరుకున్నారు. ఎగిరిన జెండా ను చూసిన రజాకార్ల కోపం కట్టలు తెంచుకుంది. జెండా ను దించి కాళ్ళతో తొక్కి ,తగలబెట్టి,అంతా కలిసి బత్తిని రామస్వామి గౌడ్ ఇంటి వైపు అరుస్తూ, తిడుతూ వచ్చారు. జెండా ఎత్తిన ప్రధాన నాయకులైన హయగ్రీవ చారి,భూపతి కృష్ణమూర్తి, పంచాయతి ఇన్‌స్పెక్టర్ కె.సమ్మయ్య, వెంకట్రాంనర్సయ్య, యం.యస్.రాజలింగం వీరందరూ బత్తిని రామస్వామి ఇంట్లో చాయ్ తాగుతూ, భవిష్యత్తు జెండా వందన కాంగ్రెస్ కార్యక్రమాల గురించి చర్చించుకుంటున్నారు. అప్పుడు ఆ ఇంటి చుట్టూ మోహరించిన రజాకార్లు ఇంట్లోకి వెళ్ళి వాళ్లను చంపే ప్రయత్నం చేసారు. లోపల ఉన్న భూపతి కృష్ణమూర్తి కాంపౌండ్ కు గొళ్లెం పెట్టాడు. రజాకార్లు రాళ్ళతో ఇంట్లోని వాళ్ళ మీద దాడి మొదలుపెట్టారు. ఏ క్షణమైన తలుపులు బద్దలు కొట్టి, జెండా ఎత్తిన నాయకులందరిని మట్టుబెట్టాలని చూసారు. జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న మొగిలయ్య, అనంతరం తాళ్లెక్కడానికి తాటి వనానికి వెళ్లాడు. మొగిలయ్య భార్య లచ్చవ్వ 15 రోజుల బాలింత, పురిటి బిడ్డతో మంచంపై ఉంది. మొగిలయ్య భార్య లచ్చవ్వ, తల్లి చెన్నమ్మ ఈ దాడితో భీతిల్లి పోయారు. శనిగరం పుల్లయ్య అనే ఆర్యసమాజ్ కార్యకర్త తాటివనంలో ఉన్న మొగిలయ్య ను కలిసి రజాకార్ల దాడి గురించి చెప్పాడు. దాడి గురించి విన్న మొగిలయ్య ఒక్క క్షణం నిశ్చేష్టుడై, మరుక్షణం తన ఇంటివైపు పరుగుతీసాడు. రజాకార్ల దాడి భీభత్సంగా సాగుతుంది. ఏ క్షణమైన ఆ ఇంట్లో ఉన్న వాళ్లంతా వందల మంది రజాకార్ల చేతుల్లో చనిపోయేట్టుగా ఉందని భావించి, తన ఇంటి వెనుక దర్వాజా నుండి రజాకార్ల కంటబడకుండ ఇంట్లోకి వెళ్ళి, మెరుపు వేగంతో ఇంటి సూరు లోని తల్వార్ ను సర్రున గుంజి, మెరుపులా రజాకార్ల సమూహం మధ్య ప్రత్యక్ష మయ్యాడు. మొగిలయ్య అరుస్తూ రజాకార్ల మూకపై పడి నరకడం మొదలుపెట్టాడు. ఈ దాడికి నాయకత్వం వహించిన ఖాసీం షరీఫ్ తో సహా, పచ్చి నెత్తురు తాగే రజాకార్లంతా చీమల పుట్ట చెదిరినట్లుగా చెదిరిపోయారు. దూరంగా చెదిరిపోయిన రజాకార్లు తిరిగి మొగిలయ్య పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. రెండవసారి జరిగిన దాడిలో మొగిలయ్య గౌడ్ దే పైచేయి, కానీ మూడవసారి జరిగిన దాడిలో ఖాసీం షరీఫ్ బల్లెంతో మొగిలయ్య వైపు వస్తున్నప్పుడు, మొగిలయ్య తన శత్రువును నరక డానికి తన కత్తిని పైకెత్తాడు.అది తన ఇంటి ముందు గల పందిరి గుంజల మధ్య చిక్కుకుంది. ఇదే అదనుగా భావించిన షరీఫ్ తన బల్లెంతో మొగిలయ్య గుండెల మీద పొడిచాడు. అది మొదలు రజాకార్ల మూకుమ్మడి దాడిలో మొగిలయ్య అమరుడైనాడు.

కౄరత్వం
మొగిలయ్య గౌడ్ ను చంపిన షరీఫ్ అతని గుండెల మీద చిమ్మిన రక్తాన్ని అరుస్తూ, ఆనందంగా తన ముఖమంతా పులుముకున్నాడు. ఖాసీం షరీఫ్ ని అతని అనుయాయులు, తమ భుజాలపై మోస్తూ ఇప్పటి వరంగల్ చౌరస్తా కు ఊరేగింపు గా తీసుకొచ్చారు. అప్పటి వరంగల్ తాలుక్ దార్ (కలెక్టర్) అబ్దుల్ మొహిత్ మిల్ ఎదురేగి, హంతకుడైన ఖాసీం షరీఫ్ కు పూలమాల వేసి ఆలింగనం చేసుకున్నాడు.

స్మారక భవనం
జెండా ఎత్తిన నాయకులకు ప్రాణ భిక్ష పెట్టి, 25సంవత్సరాల వయస్సులోనే అమరుడైన నిష్కళంక దేశభక్తుడు బత్తిని మొగిలయ్య గౌడ్ అమరత్వం చిరస్మరణీయంగా మిగిలిపోవాలని వరంగల్ నడిబొడ్డున గల జెపిఎన్ రోడ్ లో 1954 లో మొగిలయ్య స్మారక భవనాన్ని ప్రజలు ఏర్పాటు చేసారు.

Video

not found